ఫిబ్రవరిలో మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్
Posted On May 14, 2020
భారత్ వేదికగా జరుగనున్న అండర్-17 మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ షెడ్యూల్ను అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) తెలిపింది. ఈ మెగా ఈవెంట్ కొత్త షెడ్యూల్ను అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) మే 12న విడుదల చేసింది. కోవిడ్-19 కారణంగా ఈ ఏడాదిలో జరగాల్సిన మెగా టోర్నీని ఫిఫా వచ్చే ఏడాదికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు మెగాటోర్నీ జరుగుతుందని ఫిఫా ఒక ప్రకటనలో పేర్కొంది. టోర్నీలో ఆడే ఆటగాళ్ల వయసు ధృవీకరణలను ఫిఫా వెల్లడించింది. ఆటగాళ్లంతా జనవరి 1, 2003 నుంచి డిసెంబర్ 31, 2005మధ్య జన్మించినవారై ఉండాలని పేర్కొంది. మొత్తం ఐదు వేదికల్లో (కోల్కతా, గువాహటి, భువనేశ్వర్, నవీ ముంబై, అహ్మదాబాద్) ఈ టోర్నీని నిర్వహించనుండగా... మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య హోదాలో భారత మహిళల జట్టు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధించింది.