కర్తార్పూర్ కారిడార్ ప్రారంభం
Posted On November 09, 2019
రెండు దేశాలను కలిపే కర్తార్పూర్ కారిడార్ ప్రారంభం అయింది. సిక్కుల గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.
*ఈ సందర్భంగా పాక్లోని నరోవల్ జిల్లా కర్తార్పూర్లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారత్లోని డేరాబాబా నానక్ గురుద్వారాతో కలిపే కర్తార్పూర్ కారిడార్ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టును నవంబర్ 9వ తేదీ ప్రధాని మోదీ ప్రారంభించి, 500 మందితో కూడిన మొదటి యాత్రికుల బృందం యాత్ర కు వెళ్ళింది .
*అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న డేరాబాబా నానక్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవనంలో యాత్రికులకు ఆధునిక వసతులు కల్పించారు.
*పూర్తి ఎయిర్ కండిషన్తో కూడిన ఈ భవనంలో రోజుకు 5వేల మంది యాత్రికులకు క్లియరెన్స్ ఇచ్చేందుకు వీలుగా 50 కౌంటర్లు ఏర్పాటు చేశారు.
*రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం గురునానక్ తన చివరి 14 ఏళ్లు గడిపిన గురుద్వారా దర్బార్ సాహిబ్ను కలిపే 4.5 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ ద్వారా ప్రతి రోజు 5వేల మంది భారత్ యాత్రికులు సందర్శించేందుకు వీలుంటుంది.
*మొదటి బృందంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అకల్ తఖ్త్ జతేదార్ హర్ప్రీత్ సింగ్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మాజీ సీఎం ప్రకాశ్సింగ్ బాదల్, నవ్జ్యోత్ సింగ్ సిద్ధూతోపాటు పంజాబ్కు చెందిన 117 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.
*డేరాబాబా నానక్, సుల్తాన్పూర్ లోథి గురుద్వారాల వద్ద గురునానక్ జయంతి ఉత్సవాలు నవంబరు 8వ తేదీన ప్రారంభమయ్యాయి.
*పాకిస్తాన్ ఒక్కొక్కరి నుంచి 20 డాలర్లు వసూలు చేస్తుంది.కారిడార్ ప్రారంభం కానున్న ఈనెల 9వ తేదీ, గురు నానక్ జయంతి రోజైన 12వ తేదీన తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ ఒక్కో యాత్రికుడి నుంచి సుమారు రూ.1,400 (20 డాలర్లు) పాకిస్తాన్ వసూలు చేస్తుంది.
*పంజాబ్లోని సుల్తాన్పూర్ లోథిలో బెర్ సాహిబ్ గురుద్వారలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.